
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని 18వ వార్డులో నివాస గృహాల మధ్య పేరుకుపోయిన చెత్త కుప్పలు డంపింగ్ యార్డును తలపిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ జీవించాల్సిన పరిస్థితి నెలకొందని ప్రజలు వాపోయారు.
వార్డులో ఖాళీ ప్రదేశాల్లో చెత్త పేరుకుపోవడంతో, ఎవరో కాల్చిపారేసిన సిగరెట్ పీకల కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా, హుటాహుటిన అక్కడికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
ఈ సందర్భంగా వార్డు ప్రజలు మాట్లాడుతూ, నివాస ప్రాంతాల మధ్య పేరుకుపోయిన చెత్తను తక్షణమే తొలగించి శాశ్వత పరిష్కారం చూపాలని మున్సిపల్ అధికారులను కోరారు.
అగ్నిమాపక శాఖ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, వేసవి కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా అనుకోని అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందిస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
