
కారంపూడిలోని ఏపీ మోడల్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు భారత సేవా సహకార సంస్థ సభ్యుడు రవి కిరణ్ బుక్ ఫైల్స్ను పంపిణీ చేశారు. రానున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని బుధవారం విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి రవికుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు పరీక్షలను ఆత్మస్థైర్యంతో ఎదుర్కొనాలని, మంచి ఫలితాలు సాధించాలంటే క్రమశిక్షణతో చదవాలని సూచించారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ చక్ర సిమెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, విద్యార్థులు సెల్ఫోన్లకు దూరంగా ఉండాలని, అబ్దుల్ కలాం, పీవీ నరసింహారావు వంటి మహానుభావులను ఆదర్శంగా తీసుకుని విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని అన్నారు. దేశభక్తితో మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ. సుహాసిని, ప్రధానోపాధ్యాయులు శ్రీ రాధాకృష్ణమూర్తి, శ్రీ నాగేశ్వరరావు, శ్రీ బాబురావు, పదవ తరగతి అధ్యాపక బృందం రామకృష్ణ, రవిప్రసన్న, రాఘవమ్మ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
