

పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో ఇంధన సరఫరాపై అధికారులు అప్రమత్తమయ్యారు. పట్టణంలోని భారత్ పెట్రోల్ బంకును జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల, డీఎస్పీ హనుమంతరావు, ఆర్డీవో రమాకాంత్ రెడ్డి, ఎమ్మార్వో కేఎస్ చక్రవర్తి కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పెట్రోల్, డీజిల్ నిల్వలు మరియు పంపిణీ విధానాన్ని అధికారులు స్వయంగా పరిశీలించారు. ప్రత్యేకంగా కలెక్టర్ కృతిక శుక్ల స్వయంగా బంకులో పెట్రోల్ కొట్టి పరిస్థితిని అంచనా వేసి, పారదర్శకతను నిర్ధారించారు.
అనంతరం మాట్లాడిన కలెక్టర్, పెట్రోల్–డీజిల్ దొరకవనే భయంతో ప్రజలు ముందుగానే క్యాన్లలో నింపుకుని నిల్వ చేసుకోవద్దని స్పష్టంగా సూచించారు. జిల్లాలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, ఎటువంటి కొరత ఉండబోదని భరోసా ఇచ్చారు.
ఈరోజు మధ్యాహ్నం నాటికి ఎలాంటి కొరత లేకుండా సరఫరా కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ముఖ్యంగా రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
ప్రజలు పుకార్లు నమ్మకుండా, అవసరానికి మాత్రమే ఇంధనం వినియోగించుకోవాలని, సహకరించాలని కలెక్టర్ కృతిక శుక్ల విజ్ఞప్తి చేశారు.
