
కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవం: మాచర్లలో భారీ ర్యాలీ, కార్యకర్తల్లో నూతన ఉత్సాహం
మాచర్ల,: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మాచర్ల పట్టణంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా విజయోత్సవ ర్యాలీ మరియు బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై విజయోత్సవ ర్యాలీ విజయవంతం చేశారు.
కార్యక్రమానికి ముందు రింగ్ రోడ్ సెంటర్లోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి పట్టణ ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ చేపట్టారు.
ర్యాలీలో నిర్వహించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు, డప్పు వాయిద్యాలు, కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు భారీ గజమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. ప్రజలు కూడా రహదారుల వెంట నిలబడి ర్యాలీకి అభినందనలు తెలిపారు.
అనంతరం ఏర్పాటు చేసిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల స్టాళ్లను ఎమ్మెల్యే పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని పేర్కొన్నారు.
ఈ విజయోత్సవ ర్యాలీ ద్వారా కార్యకర్తలు, నాయకుల్లో కొత్త ఉత్సాహం నింపబడిందని, రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని నాయకులు పేర్కొన్నారు. మాచర్లలో జరిగిన ఈ భారీ విజయోత్సవ ర్యాలీ కార్యక్రమం కూటమి శ్రేణుల్లో నూతన జోష్ను నింపినట్లు కనిపించింది.
