
సమ సమాజ స్థాపనకు కృషి చేసిన భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి సీనియర్ నేత ఎనుమల కేశవరెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటిస్తూ ఆయన సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా ఎనుమల కేశవరెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి భారత చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని పేర్కొన్నారు. రాజ్యాంగ రూపకర్తగా ఆయన దేశానికి అందించిన మార్గదర్శకత్వం ప్రజాస్వామ్యానికి బలమైన పునాది వేసిందని తెలిపారు.
అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, సమాన హక్కులు, సమ సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకలు మాచర్లలో భక్తి, గౌరవ భావాలతో కొనసాగాయి.
