
మాచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని సహాయ వ్యవసాయ సంచాలకుల కార్యాలయంలో సోమవారం విత్తన చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాచర్ల సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల విత్తన డీలర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీ వి. జగదీశ్వర రెడ్డి మాట్లాడుతూ, విత్తన డీలర్లు అందరూ విత్తన చట్టానికి లోబడి వ్యాపారం నిర్వహించాలని సూచించారు. ప్రతి డీలర్ తమ దుకాణాల్లో అమ్మకాలు చేసే విత్తనాలకు సంబంధించిన ఫారం-సి, పి.సి పత్రాలను తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.
అనుమతి లేని హెచ్.టి. (HT) ప్రత్తి విత్తనాల విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే రైతులకు విత్తనాలు అమ్మేటప్పుడు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని, షాపులో ఉన్న విత్తనాల స్టాక్ మరియు ధరలను డిస్ప్లే బోర్డుపై ప్రదర్శించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఐదు మండలాల వ్యవసాయ అధికారులు డి. పాపకుమారి, టి. బాలాజీ గంగాధర్, వై. అమీర్ రెడ్డి, కె. లక్ష్మారెడ్డి, వై. పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
