
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని పార్క్ సెంటర్లో సంఘసంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పాల్గొని, పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…
“మహాత్మ జ్యోతిరావు పూలే గారు సమాజంలో అణగారిన వర్గాల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు. ఆయన విద్యా విప్లవానికి నాంది పలికి, మహిళల విద్యకు, సామాజిక సమానత్వానికి మార్గదర్శకుడిగా నిలిచారు. కుల వివక్ష, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడుతూ సమాజంలో మార్పు తీసుకువచ్చిన గొప్ప సంస్కర్త.

ప్రతి ఒక్కరూ పూలే గారి ఆశయాలను ఆచరణలో పెట్టుకోవాలి. విద్య ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడం ఆయన చూపిన మార్గం. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. పూలే గారి ఆలోచనలు నేటికీ సమాజానికి మార్గదర్శకం” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ కార్యకర్తలు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
