
గత 20 ఏళ్ల కాలంలో మాచర్ల నియోజకవర్గంలోని రైతుల అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేశామని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు.
మాచర్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు రూ.175 కోట్ల వ్యయంతో 45 గ్రామాల్లో రైతుల కోసం విద్యుత్ సబ్స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అదేవిధంగా 59 కిలోమీటర్ల మేర కొత్త 3-ఫేస్ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
మారుమూల గ్రామాల్లోని రైతులకు ప్రభుత్వ సేవలను చేరువ చేసేందుకు గ్రామగ్రామాన రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సహకారంతో రూ.100 కోట్ల వ్యయంతో అనుపు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను ఏర్పాటు చేసి, సుమారు 10 వేల ఎకరాలకు సాగునీరు అందించినట్లు పేర్కొన్నారు.
అదేవిధంగా వరికపుడిసెల నిర్మాణానికి తమ హయాంలో అనుమతులు సాధించి, కరోనా కాలాన్ని మినహాయిస్తే కేవలం మూడు సంవత్సరాల్లోనే పనులు ప్రారంభించినట్లు చెప్పారు.
తాము అధికారంలో ఉన్న సమయంలో రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు.
