
పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం:
అంతర్జాతీయ స్థాయిలో యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయన్న వార్తల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడుతుందన్న ప్రచారం ప్రజల్లో ఆందోళన రేపుతోంది. దీంతో మాచర్ల పట్టణంలోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా బారులు తీరారు.
పెట్రోల్ కోసం వాహనాలతో పాటు బాటిళ్లు, క్యాన్లు తీసుకుని బంకుల వద్దకు చేరుకున్న ప్రజలు అవసరానికి మించి నిల్వ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పెట్రోల్ బంకుల వద్ద తీవ్ర రద్దీ నెలకొంది.

ఈ పరిస్థితిపై స్పందించిన అధికారులు తనిఖీలు చేపట్టారు. సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ భాషా ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు, గ్యాస్ గోదాములను పరిశీలించారు.
ఈ సందర్భంగా డీలర్లకు పలు సూచనలు చేశారు:

పెట్రోల్ పంపిణీ క్రమబద్ధంగా నిర్వహించాలి
అనవసర నిల్వలను నియంత్రించే చర్యలు తీసుకోవాలి
గ్యాస్ వినియోగదారులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలి
గ్యాస్ బుకింగ్ తేదీలను నోటీస్ బోర్డుల ద్వారా స్పష్టంగా తెలియజేయాలి
ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు సమాచారం అందించాలి
అధికారులు ప్రజలను ఆందోళన చెందవద్దని, ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని భరోసా ఇచ్చారు.
