
మాచర్ల పట్టణంలో ఉగాది పర్వదినం సందర్భంగా సాహిత్య సుగంధం వెదజల్లింది. శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన “ఉగాది కవి సమ్మేళనం” శుక్రవారం పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ కవులు తమ కవిత్వంతో ఉగాది ప్రత్యేకతను ప్రతిబింబిస్తూ సభికులను అలరించారు.
డాక్టర్ బెజ్జంకి జగన్నాథ చర్యలు, డాక్టర్ ముట్టుకుల కమలహాసన్, సాయి మార్కొండ రెడ్డి, కోడెల పూర్ణచంద్రరావు, గాదె రామకృష్ణరావు, ముప్పవరపు గాంధీ, ఈవీఎలఎన్ మూర్తి, దుబ్బలదాసుకవి, జూలకంటి పోలిరెడ్డి తదితరులు కవితా పఠనంతో ఆకట్టుకున్నారు. ఉగాది ఆత్మీయత, తెలుగు సంస్కృతి, సంప్రదాయాల ప్రాముఖ్యతతో పాటు సమాజంలోని మార్పులను కవులు తమ కవిత్వంలో విభిన్న కోణాల్లో వ్యక్తం చేశారు.
ప్రతి కవి తనదైన శైలిలో కవితలను వినిపించగా, సభికులు చప్పట్లతో అభినందించారు. ఉగాది పచ్చడి, జీవన రుచులు, కాలచక్రం వంటి ప్రతీకలను కవిత్వంలో ప్రతిబింబిస్తూ పలువురు కవులు విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ కవి సమ్మేళనం సాహిత్యరసికులకు ఒక ప్రత్యేక అనుభూతిని అందించింది.
కార్యక్రమం చివరలో దుర్గి వాస్తవ్యులు బ్రహ్మశ్రీ వేదమూర్తులు ఎర్రోజు వీర నరసింహాచార్యులు రచించిన “ఆచార్య స్తుతి గేయమాలిక” పుస్తకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తక రచయితను, సభలో పాల్గొన్న ప్రముఖులను దుశ్శాలువాలతో సత్కరించారు.
తెలుగు సాహిత్య పరంపరను కొనసాగిస్తూ కొత్త తరానికి సాంస్కృతిక విలువలను పరిచయం చేయడంలో సమితి ముఖ్య పాత్ర పోషిస్తోందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమ నిర్వాహకుడు ముప్పవరపు గాంధీని పాల్గొన్నవారు అభినందిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు మరింతగా నిర్వహించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పోలిశెట్టి పుల్లారావు, ఓరుగంటి చెన్నకేశవరావు, స్థానికులు, సాహితీ ప్రియులు, కవులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
