
గుంటూరు: ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో గుంటూరులో ఆన్లైన్ బెట్టింగ్పై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో దాడులు నిర్వహించి మొత్తం 15 మంది ముద్దాయిలను అరెస్ట్ చేశారు.
లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాపై దాడులు చేసి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇస్లావత్ నాయక్ అనే వ్యక్తి “నేషనల్ ఎక్స్చేంజ్” యాప్ ద్వారా ఇతరులతో కలిసి బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దాడిలో రూ.1,25,000 నగదు, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
అలాగే ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్కే రియాజ్ అనే వ్యక్తి మరో ముగ్గురితో కలిసి ఆఫ్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించి నలుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.75,000 నగదు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ, ఐపీఎల్ సీజన్ను అవకాశంగా తీసుకుని బెట్టింగ్ ముఠాలు గ్రూపులుగా ఏర్పడి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని తెలిపారు. యువత బెట్టింగ్ వైపు ఆకర్షితులవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బెట్టింగ్ వల్ల నష్టమే తప్ప లాభం లేదని ప్రజలు గుర్తించాలని సూచించారు.
ఈ ఘటనలపై ఏపీ గేమింగ్ యాక్ట్ సెక్షన్ 66తో పాటు ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
