
“మొదట పగ తీర్చుకుంటాం.. తర్వాత అభివృద్ధి” – కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
గురజాల, పల్నాడు జిల్లా:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురజాలలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ వైసీపీ శ్రేణులు రోడ్డెక్కాయి.
ఈ కార్యక్రమంలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు.
గత రెండేళ్లలో గురజాల నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కొత్తగా ఎలాంటి పనులు చేపట్టలేదని ఆరోపించారు. వైసీపీ హయాంలో నిర్మించిన భవనాలకు కేవలం రంగులు వేయడం తప్ప అభివృద్ధి పనులు జరగలేదని ఎద్దేవా చేశారు.
అలాగే వైసీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఈ సందర్భంగా కాసు మహేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. “రాబోయేది మన ప్రభుత్వమే. మన ప్రభుత్వం వచ్చిన తొలి ఆరు నెలల్లో జరిగేది అభివృద్ధి కాదు. ముందుగా పగ తీర్చుకున్నాకే మళ్లీ అభివృద్ధి గురించి ఆలోచిస్తాం” అని వ్యాఖ్యానించారు.
కాసు మహేష్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు జిల్లాలో రాజకీయ దుమారం రేపుతున్నాయి.
