
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని కొత్త బైపాస్ రోడ్డుకు సమీపంలో ఉన్న జగనన్న ప్లాట్ల ప్రాంతంలో గురువారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిలో వ్యక్తి మృతదేహం కుళ్లిన స్థితిలో లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది.
మృతుడిని చల్ల భూదేవయ్య (50)గా గుర్తించారు. వడ్డెర కులానికి చెందిన భూదేవయ్య లారీ క్లీనర్గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. అయితే మద్యానికి బానిస కావడంతో కుటుంబ సభ్యులు దూరంగా ఉండగా, అప్పుడప్పుడు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
స్థానికుల సమాచారం మేరకు, బైపాస్ రోడ్డుకు సమీపంలోని ఓ జామ తోటలో భూదేవయ్య గతంలో సుమారు మూడు నెలల పాటు వాచ్మెన్గా పనిచేశాడు. మద్యం సేవించే అలవాటు అధికంగా ఉండటంతో యజమాని అతడిని విధుల నుంచి తొలగించినట్లు తెలిసింది. ఇటీవల మళ్లీ పనిలో చేర్చుకోవాలని కోరినా యజమాని నిరాకరించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో జామ తోట సమీపంలో నిర్మాణంలో ఉన్న ఇంటిలో భూదేవయ్య మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది. సమాచారం అందుకున్న మాచర్ల టౌన్ సీఐ మహమ్మద్ నజీర్ బేగ్ మరియు ఎస్ఐ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
భూదేవయ్య మృతి చెందిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతిగా మద్యం సేవించడం వల్ల ఆరోగ్యం క్షీణించి మృతి చెంది ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నప్పటికీ, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే అసలు కారణం వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
