
పల్నాడు జిల్లా, కారంపూడి మండలం: మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడి మండలం గాదెవారిపల్లె గ్రామంలో కారంపూడి సీఐ శరత్ బాబు ఆధ్వర్యంలో గురువారం విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. గ్రామంలోని అనుమానిత ప్రాంతాలు, ఇళ్లు, పరిసరాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఈ తనిఖీల్లో కొన్ని మారణాయుధాలు స్వాధీనం చేసుకోగా, సరైన పత్రాలు లేని 10 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆయుధాలు వ్యవసాయ అవసరాల కోసం ఉపయోగిస్తున్నవేనా లేదా ఇతర కారణాలతో ఇళ్లలో ఉంచారా అనే విషయంపై విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.
ఈ సందర్భంగా సీఐ శరత్ బాబు మాట్లాడుతూ గ్రామాల్లో శాంతి భద్రతలు పటిష్టం చేయడం, ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పడం కోసం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు, యాజమాన్య వివరాలను పరిశీలిస్తున్నామని చెప్పారు.
యువత డ్రగ్స్, గంజాయి, ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు, సైబర్ నేరాలు మరియు మోసపూరిత కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో పరస్పర సహకారం, సామరస్య వాతావరణం కొనసాగించాలని, కక్షలు, కార్పణ్యాలకు దూరంగా ఉండాలని కోరారు.
ఈ కార్డన్ సెర్చ్లో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని గ్రామంలో భద్రతా పరిస్థితులను సమీక్షించారు. ప్రజల సహకారంతో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేస్తామని పోలీసులు తెలిపారు.
