
గుంటూరు గ్రామీణ పరిధిలోని దాసరి పాలెంలో చోటుచేసుకున్న దారుణ హత్య కేసును ప్రత్తిపాడు పోలీసులు వేగంగా ఛేదించారు. భర్తను హత్య చేసి శవాన్ని గోనె సంచిలో పెట్టి చెరువులో పడవేసిన ఘటనలో భార్యతో పాటు నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఘటనకు సంబంధించి 19-03-2026న ఈదులపాలెం వద్ద జాతీయ రహదారి పక్కన చెరువులో గుర్తు తెలియని మృతదేహం కనిపించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహానికి తాడుతో రాయి కట్టి నీటిలో పడవేసినట్లు గుర్తించారు. సంఘటనా స్థలంలో మిరప గోనె సంచి కూడా లభ్యమైంది.
దర్యాప్తులో భాగంగా మృతుడు తన్నీరు వెంకటేశ్వర్లు (30), పొన్నూరు మండలం వాసి, ప్రస్తుతం దాసరిపాలెంలో నివసిస్తున్నట్లు గుర్తించారు. అతను మద్యానికి బానిసై భార్యపై అనుమానం పెంచుకుని తరచూ వేధింపులకు గురిచేసేవాడని పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో మార్చి 17న ఇంట్లో జరిగిన ఘర్షణలో ఉప్పుతల్ల లక్ష్మి @ తిరుపతమ్మ (భార్య), సిద్ధి సురేష్, సిద్ధి అంకమ్మ, దండుగుల ఓంకార్ కలిసి దాడి చేసి తాడుతో కట్టేసి కర్రలు, ఇనుప పరికరాలతో హత్య చేసినట్లు వెల్లడైంది. అనంతరం శవాన్ని తొలుత ఇంట్లో పూడ్చిపెట్టాలని యత్నించి, తర్వాత మిరప గోనె సంచిలో పెట్టి బైక్పై తీసుకెళ్లి చెరువులో పడవేసినట్లు విచారణలో తేలింది.
కొండ ప్రాంతాల్లో దాక్కున్న నిందితులను గంటల వ్యవధిలోనే ప్రత్తిపాడు ఎస్సై నరహరి ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో ఉపయోగించిన కర్రలు, ఇనుప పరికరాలు, మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
