
పల్నాడు జిల్లా – నరసరావుపేట:
నరసరావుపేటలో టిడిపి-జనసేన మధ్య నెలకొన్న వివాదం కొత్త మలుపు తీసుకుంది. ఇప్పటివరకు ఈ రెండు పార్టీల మధ్య సాగుతున్న విభేదాల్లోకి తాజాగా బీజేపీ కూడా ప్రవేశించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
బీజేపీ ఇన్చార్జ్ రంగిశెట్టి రామకృష్ణ, జనసేన ఆరోపణల వెనుక స్థానిక ఎంపీ శ్రీకృష్ణ దేవరాయల పాత్ర ఉందని బహిరంగంగా ఆరోపించడం హాట్ టాపిక్గా మారింది. ఈ వ్యాఖ్యలతో ఎంపీ-ఎమ్మెల్యే మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్ మరోసారి వెలుగులోకి వచ్చింది.
“నరసరావుపేటలో కొందరు ఎమ్మెల్యే వద్దు, ఎంపీ ముద్దు అన్నట్లు వ్యవహరిస్తున్నారు” అని రంగిశెట్టి విమర్శించారు. అంతేకాకుండా, బహిరంగ వేదికపై సొంత పార్టీ ఎంపీపై విమర్శలు చేస్తున్నప్పటికీ, ఎమ్మెల్యే అరవిందబాబు వారించకపోవడంపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.
జనసేన పార్టీ చేసిన త్యాగాలు, వారు ఎదుర్కొన్న కష్టాలు ఏమిటో వివరించాలని సవాల్ విసిరిన రంగిశెట్టి, “జనసేనకు హైకమాండ్ వైసీపీనే” అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
అదే సమయంలో జనసేనలో ఎక్కువగా కాపు సామాజికవర్గానికి చెందిన వారు ఉన్నారని, వారికి ఎమ్మెల్యే అరవిందబాబు న్యాయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఇక కూటమి పార్టీల మధ్య బహిరంగ విమర్శలపై కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు ఉంటే పరస్పరం చర్చించుకోవాలే తప్ప ఇలా బయటపెట్టడం మంచిది కాదని అభిప్రాయపడుతున్నారు.
