
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లలో సోమవారం (మార్చి 16) నుంచి ఒంటి పూట బడులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విద్యార్థులు ఉదయం 7.45 గంటలకే పాఠశాలలకు వెళ్లి మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు.
ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ రోజు నుంచి ఒంటి పూట బడులు ప్రారంభమయ్యాయి. ఈ విధానం ఏప్రిల్ 23వ తేదీ వరకు కొనసాగనుండగా, అనంతరం ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి.
ఇదిలా ఉండగా, మార్చి నెలలో విద్యార్థులకు వరుస సెలవులు రానున్నాయి. ముఖ్యంగా ఈ వారంలో ఉగాది పండుగతో మొదలై వరుసగా నాలుగు రోజులు సెలవులు ఉండనున్నాయి.
మార్చి 19న ఉగాది, మార్చి 20న జుమాత్ ఉల్ విదా, మార్చి 21న రంజాన్ పండుగలు ఉండగా, మార్చి 22న ఆదివారం కావడంతో గురువారం నుంచి ఆదివారం వరకు వరుసగా నాలుగు రోజులు సెలవులు లభించనున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వరుసగా సెలవులు వస్తున్నాయి.
అంతేకాకుండా మార్చి 26న శ్రీరామనవమి, మార్చి 31న మహవీర్ జయంతి కూడా ఉన్నాయి. ఈ విధంగా మార్చి నెలాఖరు నాటికి మొత్తం ఆరు రోజులు సెలవులు ఉండనున్నాయి.
ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉద్యోగులు ముందుగానే ప్రయాణాల కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కొందరు సొంత ఊర్లకు వెళ్లేందుకు ఆర్టీసీ, రైల్వేల్లో రిజర్వేషన్లు కూడా చేసుకుంటున్నారు.
ఉగాది పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలు ప్రత్యేక బస్సులు నడపాలని ఇప్పటికే నిర్ణయించాయి. ముఖ్యంగా మార్చి 17, 18 తేదీల్లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండటంతో అదనపు బస్సులు ఏర్పాటు చేయనున్నారు.
అలాగే సెలవుల అనంతరం మార్చి 23న తిరుగు ప్రయాణంలో కూడా రద్దీ ఉండే అవకాశం ఉండటంతో అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక పండగ రోజుల్లో ఉచిత బస్సు పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం యథావిధిగా కొనసాగనుంది.
