





అన్నదాతల ఉన్నతే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత నగదు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మండలంలోని శిరిగిరిపాడు శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వ్యవసాయ అనుబంధ స్టాల్స్, ప్రకృతి వ్యవసాయంతో పండించిన పంటలు, చిరుధాన్యాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని 38,926 మంది రైతులకు రూ.21 కోట్లు 89 లక్షల 32 వేల విలువైన నగదు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ, సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని రైతులకు సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగానికి ప్రాధాన్యత ఇస్తూ, అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో రూ.20 వేల నగదు జమ చేసినట్లు తెలిపారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల అభివృద్ధికి కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు.
వరికపూడిశెల నిర్మించకపోతే రాజకీయ సన్యాసం
పల్నాడు ప్రజల జీవనాడి అయిన వరికపూడిశెల ప్రాజెక్టును నిర్మించి రైతులకు అంకితం చేయకపోతే తమ కుటుంబమంతా రాజకీయ సన్యాసం తీసుకుంటామని ఎమ్మెల్యే జూలకంటి ప్రకటించారు. 2029 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుతో కలిసి పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసినప్పుడు, కూటమి ప్రభుత్వంలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు.
గ్రామీణ తాగునీటి అవసరాల కోసం జల్ జీవన్ మిషన్ ద్వారా రూ.1200 కోట్ల నిధులు కేటాయించి, గ్రామాల్లో పనులు ప్రారంభించామని తెలిపారు. తాగు, సాగునీటి ప్రాజెక్టుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ జగదీశ్వర్ రెడ్డి, ఎంపీపీ సంజీవరెడ్డి, ఎంపీడీఓ సాంబశివారావు, ఎమ్మార్వో రాజశేఖర్ నాయక్, వెల్దుర్తి ఏవో బాలజీ గంగాధర్, దుర్గి ఏవో అమీర్ రెడ్డి, కారంపూడి ఏవో నరసింహారావు, మాచర్ల ఏవో పాపకుమారి, మాచర్ల ఏఎంసీ చైర్మన్ రాజబోయిన మధుసూదన్ యాదవ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
