
ఆంధ్రప్రదేశ్లో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మంత్రులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 6 నెలల్లో ఎన్నికలు జరగొచ్చని, అందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని ప్రజలకు వివరించడంతో పాటు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో కూటమి విజయమే సాధించిందని, రాబోయే ఎన్నికల్లో కూడా గెలుపు కూటమిదే కావాలని చెప్పారు.
అదేవిధంగా గ్యాస్ కొరత రాకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఎలక్ట్రిక్ స్టవ్ల వినియోగం పెరగడం వల్ల విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున దానిపై కూడా నిఘా ఉంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
