


పల్నాడు జిల్లా రెంటచింతల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో HPV (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సిన్ కార్యక్రమాన్ని డాక్టర్ ప్రదీప్ కుమార్, డాక్టర్ రమాదేవి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ, ఈ వ్యాక్సిన్ భవిష్యత్తులో ఆడపిల్లలకు రొమ్ము క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా నివారించడంలో సహాయపడుతుందని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ 2011 మార్చి నుంచి 2012 ఫిబ్రవరి 28 మధ్య జన్మించిన 14 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలకు మాత్రమే ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం అందిస్తున్నట్లు చెప్పారు.
ఈ వ్యాక్సిన్ పొందాలనుకునే తల్లిదండ్రులు ముందుగా తమ గ్రామ పరిధిలోని ANM ను సంప్రదించి, ఆడపిల్లల ఆధార్ కార్డు మరియు జనన తేదీ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అనంతరం రెంటచింతల పీహెచ్సీకి వచ్చి ఈ వ్యాక్సిన్ను పూర్తిగా ఉచితంగా పొందవచ్చు.
రెంటచింతల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ వ్యాక్సిన్ ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. వ్యాక్సిన్ వేయించే సమయంలో తల్లి లేదా తండ్రి ఎవరో ఒకరు తప్పనిసరిగా పిల్లతో ఉండాలని సూచించారు.
సాధారణంగా బయట ఈ వ్యాక్సిన్ ధర సుమారు రూ.10,000 వరకు ఉంటుందని, కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని డాక్టర్ ప్రదీప్ కుమార్ తెలిపారు. వ్యాక్సిన్ వేసిన అనంతరం సర్టిఫికెట్ కూడా అందజేస్తామని చెప్పారు.
ఈ అవకాశాన్ని రెంటచింతల మండలంలోని 14 సంవత్సరాలు నిండిన ఆడపిల్లల తల్లిదండ్రులు తప్పక వినియోగించుకోవాలని వైద్యులు కోరారు. 📰

