



మాచర్ల: రోటరీ క్లబ్ ఆఫ్ మాచర్ల వారి ఆధ్వర్యంలో మాచర్ల నియోజకవర్గంలోని మాచర్ల, దుర్గి, వెల్దుర్తి మండలాలకు చెందిన జిల్లా పరిషత్ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూల్స్, గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలు మరియు పెద్ద కాన్వెంట్ పాఠశాలల్లో చదువుతున్న పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న 700 మందికి పైగా విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని పంపిణీ చేశారు.
సుమారు రూ.50 వేల విలువైన పరీక్షా సామాగ్రిని ఆయా పాఠశాలలలో విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు, రోటరీ డిస్ట్రిక్ట్ 3150 డిసీజెస్ అండ్ ప్రివెన్షన్ చైర్మన్ డాక్టర్ కొండవీటి రామకోటయ్య పరీక్షల సమయంలో విద్యార్థులు ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచనలు చేశారు.
రోటరీ క్లబ్ ఆఫ్ మాచర్ల ఎలెక్ట్ ప్రెసిడెంట్ పఠాన్ నాగూర్ వలి మాట్లాడుతూ, పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆశలను నెరవేర్చే విధంగా ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
అలాగే ఎం.బీ.ఎస్. కోటేశ్వరరావు విద్యార్థులు వివిధ సబ్జెక్టులను ఎలా సమర్థంగా అభ్యసించాలో పలు సూచనలు చేశారు.
రోటరీ క్లబ్ అధ్యక్షుడు తుమ్మల సత్యప్రసాద్, కార్యదర్శి ఆలేటి కోటేశ్వరరావు, ట్రెజరర్ యనమదల వెంకటరామయ్య మాట్లాడుతూ విద్యార్థుల అభివృద్ధి కోసం రోటరీ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, విద్యార్థులకు సహాయ సహకారాలు అందించడంలో ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.
రోటరీ క్లబ్ అందిస్తున్న సేవలను వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ మేనేజర్ దివాకర్, లవ్ అండ్ ఆఫ్ క్లబ్ అధ్యక్షుడు రవికుమార్, రోటరీ క్లబ్ సభ్యులు రిటైర్డ్ ఉపాధ్యాయిని స్వరూప, ఇక్కుర్తి శంకర్, తీర్లిక శ్రీనివాసరావు, కోనేరు శంకర్, బిచ్చాలు నాయక్, పందిరి నరసింహారావు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 📰
