వినుకొండ పట్టణంలో ప్రధాన రహదారుల వెంట జరుగుతున్న ఆక్రమణలను తొలగించి ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని మున్సిపల్ కమిషనర్ కె. శివరాం ప్రసాద్ తెలిపారు.
పట్టణంలోని ప్రధాన రోడ్లకు ఇరువైపులా అక్రమ నిర్మాణాలు, చిరు వ్యాపారులు రహదారులపైనే వ్యాపారాలు నిర్వహించడం వల్ల రోడ్లు తీవ్ర రద్దీకి గురవుతున్నాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కమిషనర్ అక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు. పట్టణ పోలీసుల సహకారంతో ప్రధాన రహదారుల వెంట ఆక్రమణలను తొలగించే చర్యలు ప్రారంభించారు.
ప్రజలు స్వచ్ఛందంగా సహకరించి ఆక్రమణలను తొలగించుకోవాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సూచనల మేరకు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతూ, ట్రాఫిక్ సమస్యలు లేని పట్టణంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
ఆక్రమణల తొలగింపు వల్ల తాత్కాలిక ఇబ్బందులు తలెత్తినప్పటికీ, దీర్ఘకాలంలో పట్టణానికి మేలు జరుగుతుందని ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని కమిషనర్ పిలుపునిచ్చారు.

