యాంత్రీకరణను వ్యవసాయంలో విస్తృతంగా ఉపయోగిస్తేనే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి వ్యవసాయశాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. రైతులను అవగాహన పరచి ప్రకృతి వ్యవసాయం వైపు మరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న వ్యవసాయ పనిముట్లు, బ్యాటరీ పవర్ స్ప్రేయర్లు, టార్పాలిన్ పట్టాలు వంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు చేరవేయాలని అధికారులకు ఆదేశించారు.
పంట మార్పిడి విధానం ద్వారా నేల సారాన్ని కాపాడుకోవచ్చని, ప్రకృతి వ్యవసాయం ద్వారా ఖర్చులు తగ్గి లాభాలు పెరుగుతాయని రైతులకు వివరించాలని స్పష్టం చేశారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, యాంత్రీకరణ వినియోగం పెరిగితే రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో వ్యవసాయశాఖ ఏడీ జగదీశ్వరరెడ్డి, మాచర్ల ఏవో పాపకుమారి, రెంటచింతల ఏవో లక్ష్మారెడ్డి, వెల్దుర్తి బాలాజీ గంగాధర్ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

