
మాచర్ల: పల్నాడు జిల్లాలో చారిత్రకంగా పేరుగాంచిన అడిగోప్పల శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి తిరునాళ్లు రేపు అట్టహాసంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయానికి మొత్తం 22 కుంకుమ బండ్లు బయలుదేరనున్నట్లు సమాచారం.
అమ్మవారి స్వగ్రామమైన అడిగోప్పల గ్రామంలోని పుట్టింటి నుంచి మొదటి కుంకుమ బండి బయలుదేరి, అనంతరం ఇతర గ్రామాల నుంచి వచ్చే కుంకుమ బండ్లు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారి ఆలయానికి చేరుకుంటాయి.
అడిగోప్పల గ్రామం నుంచి 13 కుంకుమ బండ్లు, నరమాలపాడు గ్రామం నుంచి 3, ఓబులేసునిపల్లె గ్రామం నుంచి 6 కుంకుమ బండ్లు బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది.
పల్నాడు జిల్లాలో చారిత్రకంగా గుర్తింపు పొందిన ఈ తిరునాళ్లకు లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలని ఆలయ కమిటీ కోరింది.
తిరునాళ్లకు వచ్చే భక్తులకు మార్గమధ్యంలో అన్నదానం, మజ్జిగ వంటి సేవలు ఏర్పాటు చేస్తే మంచిదని భక్తులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ వెల్లడించింది.
