
గుంటూరు జిల్లా, వట్టిచెరుకూరు:
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వట్టిచెరుకూరు మండలంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. వట్టిచెరుకూరు ప్రభుత్వ బీసీ వసతి గృహంలో ఉంటున్న పదో తరగతి విద్యార్థి చెరువులో పడి మృతి చెందాడు.
మృతుడు మండల రాజేష్ (18)గా గుర్తించారు. అతను మాచర్ల మండలం నాగులవరం గ్రామానికి చెందిన మండల రామయ్య, లింగమ్మల కుమారుడు. వట్టిచెరుకూరు బీసీ హాస్టల్లో ఉంటూ స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు.
ఈ నెల 16న జరిగిన తెలుగు పరీక్ష సరిగా రాయలేదన్న మనస్తాపంతో రాజేష్ తీవ్ర ఆందోళనలో ఉన్నాడని తోటి విద్యార్థులు తెలిపారు. వార్డెన్, వాచ్మన్ అతనికి ధైర్యం చెప్పినప్పటికీ, ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం బాధాకరం.
అయితే మృతికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ సందర్భంగా వట్టిచెరుకూరు సీఐ రామా నాయక్ విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. పరీక్షల విషయంలో భయాందోళనలకు గురై ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని, ప్రతి విద్యార్థి జీవితంలో పరీక్షలు ఒక భాగమేనని, తల్లిదండ్రుల ఆశలు, బాధ్యతలను గుర్తుంచుకోవాలని సూచించారు.
