


పల్నాడు జిల్లా మాచర్ల పురపాలక సంఘం సాధారణ కౌన్సిల్ సమావేశం మున్సిపల్ చైర్మన్ మదర్ సాహెబ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి హాజరయ్యారు.
పట్టణ అభివృద్ధికి సంబంధించి కౌన్సిల్ సమావేశంలో మొత్తం 18 అంశాలను కౌన్సిల్ సభ్యుల ముందుంచగా, వాటిని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ చివరి కౌన్సిల్ సమావేశానికి హాజరైన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. పట్టణ అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన అంశాలను ఆమోదించినందుకు కౌన్సిల్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని పట్టణంలో ఎక్కడా నీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే పట్టణంలో చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులు ప్రజలకు దీర్ఘకాల ప్రయోజనం కలిగించేలా ఉండాలని, ఒకరికి ఇబ్బంది కలిగినా పదిమందికి ఉపయోగపడేలా రాజీ లేకుండా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలో చికెన్, మటన్, ఫిష్, కూరగాయలు వంటి అన్ని వస్తువులు ఒకే కాంప్లెక్స్లో అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని, దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మరియు వచ్చిన తర్వాత పట్టణంలో జరిగిన అభివృద్ధి పనులను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వ హయాంలో మాచర్ల పట్టణం మరియు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వేణుబాబు మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయానికి రావాల్సిన బకాయిలు వసూలు అయితే పట్టణ అభివృద్ధికి చేపట్టబోయే ప్రణాళికల గురించి ఎమ్మెల్యేకు వివరించారు.
అలాగే పట్టణంలో శానిటేషన్ పనులపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా స్లమ్ ప్రాంతాల్లో చెత్తాచెదారం తొలగించి ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
